క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్‌ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.నేపాల్‌ క్యాసినోకు 10 మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైనట్లు ఈడీ గుర్తించింది. క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన చెల్లింపులు.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఐఎస్‌ సదన్‌లోని ప్రవీణ్‌ ఇల్లు, కడ్తాల్‌లోని ఫాంహౌస్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు హాజరైనట్లు గుర్తించారు. సోషల్‌ విూడియా ద్వారా క్యాసినో వీడియోలను ప్రవీణ్‌ ప్రచారం చేసినట్లు తేల్చారు. జనవరిలో గుడివాడ గ్యాంబ్లింగ్‌లోనూ ఆయన హస్తం ఉన్నట్లు గుర్తించారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది