ఖాళీలను భర్తీ చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా


ఒంగోలు,నవంబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డైఫీ) ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎస్సై పోస్టులను 1600, కానిస్టేబుల్‌ పోస్టులను ఆరు వేలకు పెంచాలని కోరారు. అదే విధంగా గ్రూపు2 పోస్టులను 337 నుంచి రెండు వేలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె. లక్ష్మణ్‌ రావులతో పాటు డైఫీ ప్రతినిధులు పాల్గొన్నారు.