ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి):
కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన సోమవారం తిప్పికొట్టారు. ఆయనకు దమ్ముంటే జంతర్‌మంతర్‌ వద్దకు రావాలని, తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. మంత్రిని రక్షించేందుకు కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ సర్కారు కుమ్మక్క య్యాయని ఆరోపించారు. ఖుర్షీద్‌పై తాను చేసిన ఆరోపణలకు కేజ్రీవాల్‌ మరిన్ని ఆధారాలు బయటపెట్టారు. మంత్రి ఆదివారం నాటి విూడియా
సమావేశంలో విడుదల చేసిన ఫొటోలు, పత్రాలన్నీ నకిలీవేనని స్పష్టం చేశారు. ట్రస్టు పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చూపిన ఫొటోలు, పత్రాలు అన్నీ నకిలీవేనని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖుర్షీద్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. కేజ్రీవాల్‌ సోమవారం జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఖుర్షీద్‌పై వచ్చిన ఆరోపణలను నిరూపించే మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మంత్రి నేతృత్వంలో నడుస్తున్న జకీర్‌ హుస్సేన్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ బోగస్‌ లబ్ధిదారులతో పేరుతో దోచుకుందని వెల్లడించారు. అందుకు సంబంధించిన పత్రాలను విడుదల చేశారు. ఖుర్షీద్‌ విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో పేర్లకు, వాస్తవాలకు పోలికే లేదని స్పష్టం చేశారు. తన ట్రస్టు ద్వారా లబ్ధి పొందారని ఖర్షీద్‌ చెబుతున్న వ్యక్తులు చాలా మంది కొన్నేళ్ల క్రితమే చనిపోయారన్నారు. ఆయన ఇచ్చిన జాబితాలోని పేర్లు గల వ్యక్తలు అసలు లేనేలేరని, మరికొంత మంది అసలు వికలాంగులే కాదని స్పష్టం చేశారు. ఇక, లబ్ధి పొందారని ఖుర్షీద్‌ ఇచ్చిన జాబితాలో పేరు ఉన్న ఓ వికలాంగుడిని కేజ్రీవాల్‌ విూడియా ఎదుట ప్రవేశపెట్టారు. ట్రస్టు నుంచి తనకెలాంటి సహాయం అందలేదని
ఉత్తరప్రదేశ్‌లోని మణిపురికి చెందిన ఆ వికలాంగుడు తేల్చిచెప్పాడు.
ఖుర్షీద్‌ తక్షణమే తన పదవి నుంచి వైదొలగాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఖుర్షీద్‌, ఆయన భార్యను అరెస్టు చేయాలన్నారు. కేంద్ర మంత్రిపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నోరు తెరవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఖుర్షీద్‌ను బయటపడేసేందుకు కేంద్రం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో కుమ్మక్కైందని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ నుంచి ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ను తప్పించేందుకు కేంద్రం సహకరిస్తుందని, అందుకు బదులుగా అఖిలేశ్‌ ప్రభుత్వం ఖుర్షీద్‌ను రక్షించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఖుర్షీద్‌ను విచారించేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. కానీ, దర్యాప్తు ఎవరు చేస్తారన్నదే అసలు ప్రశ్న. అఖిలేశ్‌ యాదవా? అతని తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ అక్రమాస్తుల ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. ములాయంకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ఎవరు నియమిస్తారు? న్యాయశాఖ మంత్రే కదా! అందుకే ఖుర్షీద్‌ ములాయంను రక్షిస్తారు. అందుకు బదులుగా ములాయం కుమారుడు ఖుర్షీద్‌ను రక్షిస్తారు’ అని చెప్పారు. అందుకే, ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు నిజమేనని విజిలెన్స్‌ తనిఖీల్లో వెల్లడైన తర్వాత మళ్లీ విచారణకు ఆదేశించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అఖిలేశ్‌ ప్రభుత్వం చేపట్టిన తాజా విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగుచూడవన్నారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే, విచారణ పూర్తయ్య వరకూ ఈ అంశంపై తాను
స్పందించబోనని యూపీ ముఖ్మంత్రి అఖిలేశ్‌యాదవ్‌ అన్నారు.