గొంతుకు అడ్డంపడ్డ చికెన్ ముక్క
ఏడాది బాలుడు మృతి
కర్నూలు,డిసెంబర్17(జనంసాక్షి): చికెన్ ముక్క గొంతుకు అడ్డంపడి ఏడాది వయసున్న బాలుడి ఉసురు తీసింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరులో ఆదివారం రాత్రి సంఘటన చోటుచేసుకున్న ది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. తల్లిదండ్రులుకన్నీరుమున్నీరయ్యారు. గ్రామానికి చెందిన రాముడు, సోమేశ్వరి దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఆరేళ్లకు కుమారుడు సతీష్ పుట్టాడు. సోమేశ్వరి ఆదివారం రాత్రి చికెన్ వండే పనిలో ఉంది. అక్కడే ఆడుకుంటున్న సతీష్ వచ్చి ప్లేటులోని ఒక పచ్చి చికెన్ ముక్కను నోట్లో పెట్టుకున్నాడు. ఈ సంగతి తల్లి గమనించలేదు. కొద్దిసేపటికి బాలుడికి ఊపిరాడక కిందపడిపోయాడు. ఆందోళన చెందిన తల్లి.. కొడుకుని భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగెత్తింది. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బాలుడి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కునట్లు వైద్యులు గుర్తించారు.