గొర్రెల పంపిణీ దుర్వినియోగం చేస్తే చర్యలు

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే కొందరు వీటిని అప్పుడే అమ్ముకుంటున్నారని విమర్శలు రావడంతో నిఘా పెట్టారు. ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే రెవెన్యూ రికవరీ యాక్టు కింద వడ్డీతో కలిపి సబ్సిడీ సొమ్మును వసూలు చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అంతేకుండా సదరు సంఘాలను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని.. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సబ్సిడీ కింద వచ్చిన గొర్రెల అమ్మకం.. కొనుగోలు నేరమని పేర్కొంటున్నారు. 15 రోజులకు ఒకసారి తనిఖీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గొర్ల కాపర్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు గొర్రెల యూనిట్ల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.. పలు చోట్ల గొర్రెల యూనిట్లను అమ్ముకుంటున్నారనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గొర్రెల యూనిట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్‌లకు బాధ్యతలు అప్పగించారు. వీరు ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆయా గ్రామాల్లో అందజేసిన గొర్రెల యూనిట్ల పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా నిరంతర నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గొర్రెల సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. మొత్తంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. గొర్ల కాపర్లలో అవగాహన పెంచుతోంది. అలాగే సబ్సిడీపై గడ్డివిత్తనాలు ఇచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. గొర్రెలకు సంపూర్ణ రక్షణగొర్రెల యూనిట్ల లబ్ధిదారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యూనిట్‌ సొమ్ములో ఇన్సూరెన్స్‌ కూడా తోడై ఉంది. దీంతో ఏ ఒక్క గొర్రె చనిపోయినా దాని స్థానంలో మరో గొర్రెను అందించనున్నారు. ఇదిలా ఉంటే గొర్రెల సంరక్షణ కోసం పశువైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా రు. లబ్ధిదారుల వద్దకు చేరుకోగానే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా టీకాలు వేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి

చికిత్సలు చేసి లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నారు. గొర్రెల మేతకు అవసరమైన గడ్డి విత్తనాలను 100 శాతం ఉచితంగా అందించేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు అటు రైతులకు ఇటు గొర్రెల కాపరులకు ఉపయోగకరంగా ఉండే విధానాలను కూడా రూపొందిస్తున్నారు.