గ్రామదర్శినితో సమస్యలపై అవగాహన: మంత్రి సుజయ

విజయనగరం,నవంబర్‌22(జ‌నంసాక్షి):గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నారు. ప్రజాసమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. విజయనగరం జిల్లా బడంగి మండలం మల్లంపేట గ్రామంలో మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా వినతులను సేకరించిన మంత్రి సుజయ్‌ ప్రజలతో పూర్తిస్థాయిలో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామదర్శిని గ్రామ వికాసం రూపొందించారన్నారు. గ్రామాలను అభివృద్ధి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పని చేస్తున్నారని.. ఎన్నడూ లేనంతగా గ్రామాలు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెల్లో అభివృద్ధి వికాసం ప్రభుత్వం మొదటి లక్ష్యం అన్నారు. అనంతరం మంత్రి మల్లం పేట గ్రామ సభలో పాల్గొన్నారు.