గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం
కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్కు ప్రపంచఖ్యాతి
చిలుకానగర్లో ప్రచారంలో నిర్వహించిన మంత్రి సత్యవతి
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికల్లో మరోమారు గన విజయం సాధిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఎంతగానో పురోభివృద్ది చెందిందని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో ప్రచారం చేపట్టారు. ముందుగా మంత్రి సత్యవతి రాథోడ్ ధర్మపురి కాలనీలోని సాయి బాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల్లోనూ చిలుకా నగర్లో ప్రచారం నిర్వహించి ఇక్కడ అభ్యర్థి భారీ గెలుపుతో విజయం సాధించేలా కృషి చేశానని, ఈసారి కూడా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిందని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ధి చేశారని, శాంతిభద్రతలు అద్భుతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. యువ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చేశారని చెప్పారు. రైల్వేస్టేషన్లో చాయి అమ్ముకొని ప్రధానమంత్రిని అయ్యానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ నేడు అదే రైల్వే వ్యవస్థను దానితోపాటు ఎల్ఐసి వంటి మరో 23 పెద్ద ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వ సంస్థల వ్యతిరేక పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్యం తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కనీస ప్రజాదరణకు నోచుకోక చతికిల పడిందని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు హైదరాబాదులో మతకల్లోలాలు, నిత్యం కర్ఫ్యూ వుండేవని, గత ఏడేళ్ల కెసిఆర్ పాలనలో కర్ఫ్యూ, మతకల్లోలాలు లేని మతసామరస్య నగరంగా, శాంతిభద్రతలు అద్భుతంగా కొనసాగుతున్న నగరంగా మారిందని, దీనిని ప్రజలు గుర్తించి ఈ మతసామరస్యాన్ని, శాంతిభద్రతలను కొనసాగించేందుకు మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ముఖ్యంగా చిలక నగర్ డివిజన్లో పేదలు, ధనికులు, మేధావులు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని, గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇక్కడ ప్రచారం చేసినప్పుడు భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. విూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత ఐదేళ్లు అందుబాటులో ఉంటూ, చిల్కానగర్ అభివృద్ధి చేశామన్నారు. ఈసారి నేను మంత్రిగా ఉండడం, నా ఇల్లు ఇక్కడే ఉండటం వల్ల చిలకనగర్ మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పని చేస్తానని హావిూ ఇస్తున్నానన్నారు.హైదరాబాద్ అభివృద్ధి ఇంకా వేగంగా జరిగేందుకు ప్రోత్సహించేలా మరోసారి టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.