చిల్లర కాటాలతో మోసం తగదు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): చిల్లర కాంటాలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి తెలిపారు.ఇటీవల చిల్లర కాంటా ద్వారా కొనుగోలు చేసిన పత్తిని ట్రాక్టర్‌, టాటా మ్యాజిక్‌ వాహనాల్లో నింపుతుండగా మార్కెట్‌ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీచేసి పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఆ వ్యాపారికి జరిమానా కూడా విధించామని అన్నారు. గ్రామాల్లో చిల్లర కాంటాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్‌ పరిధిలోని రైతులు స్వయంగా వారు పండించిన పంటలను నేరుగా మార్కెట్‌కు తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామాల్లో లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు చిల్లర కాంటాలను నిర్వహిస్తూ రైతులకు పెద్దఎత్తున నష్టం చేస్తున్నారన్నారు. చిల్లర కాంటాల వల్ల రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, వ్యాపారులు నేరుగా మార్కెట్‌కు వచ్చి వారికి కావాల్సిన పత్తిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లో వ్యాపారులు చిల్లర కాంటాలను నడపకుండా నిరంతరంగా తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు.