ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ కన్నుమూత

– దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం రమణ్‌సింగ్‌
రాయపూర్‌, ఆగస్టు14(జ‌నం సాక్షి): చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్సపొందుతూ రాయ్‌పూర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుండెపోటురాగా.. ఆస్పత్రిలో చికిత్సపొంది కాస్త తేరుకున్నారు. మళ్లీ ఇంతలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. బలరామ్‌జీ మృతిపట్ల ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. గవర్నర్‌గా ఆయన  రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేమని సీఎం తెలిపారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు. అలాగే ప్రభుత్వం వారంపాటూ సంతాప దినాలుగా ప్రకటించింది. బలరామ్‌జీ దాస్‌ టాండన్‌ 1927 నవంబర్‌ 1న పంజాబ్‌లో జన్మించారు. అమృత్‌సర్‌లో కార్పొరేటర్‌గా గెలిచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత బీజేపీలో ఆయన కీలక పదవుల్లో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాద్‌ జన్‌సంఘ్‌ స్థాపించినవారిలో ఈయన కూడా ఒకరట. అంతేకాదు దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 1975 నుంచి 1977 వరకూ జైలు జీవితం గడిపారు. రాజకీయాలే కాదు ఆటల్లో కూడా బలరామ్‌జీకి ప్రావిణ్యం ఉంది. ఆయన వాలీబాల్‌, స్విమ్మింగ్‌, కబడ్డీ బాగా ఆడేవారట. బలరామ్‌జీ 2014లో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.