జగన్‌ది ఎప్పటిలాగే రివర్స్‌ విధానం

పెట్రో ధరలు తగ్గించడంలో విఫలం: సోమిరెడ్డి
9న టిడిపి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు
అమరావతి,నవంబర్‌6 (జనంసాక్షి):  సీఎం జగన్‌ జనం నడ్డి విరగ్గొడుతున్నారని.. బార్డర్‌లో బంకులను మూసి వేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ముడిచమురు ధరలు పెరిగి నప్పుడల్లా.. ఏపీలో పన్నులు పెంచుకుంటూ ఆదాయమే చూసుకున్నారన్నారు. కేంద్రం సహా పలు రాష్టాల్రు పెట్రో ధరలు తగ్గించినా.. జగన్‌ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్‌ విధానాన్ని కొనసాగిస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. పన్నులు తగ్గించకపోవడంతో పెట్రోల్‌ బంకులు మూతపడుతుండగా.. మద్యం తక్కువ ధరకే అక్రమంగా పోటెత్తుతోందన్నారు. పెట్రోల్‌, బ్రాండెడ్‌ మద్యం కోసం ఇక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతుంటే.. గంజాయి కోసం మాత్రం దేశమంతా ఏపీ వైపు చూస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. పెట్రో ధరల తగ్గింపు కోసం ఈ నెల 9న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయనుంది. రాష్ట్రంలో ధరలను తగ్గించాలని పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని రాష్టాల్ర కంటే తక్కువ ఇస్తానని నాడు జగన్‌ చెప్పారని… దాన్ని చేసి చూపించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై 16 ` 17 రూపాయాలు తగ్గించాలని కోరుతోంది. పెట్రోల్‌ నుంచి మద్యం వరకూ అన్ని రాష్టాల్ర కంటే ఏపీలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ చెబుతోంది.