జగన్‌పై దాడికేసులో.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

– కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదు
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
– పూర్తివివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం
– బుధవారానికి తదుపరి విచారణ వాయిదా
హైదరాబాద్‌, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సోమవారం హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది.
ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్‌ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన న్యాయస్థానం పై విధంగా స్పందించింది. ఎన్‌ఐఏ యాక్ట్‌ సెక్షన్‌ 6 ప్రకారం ఎయిర్‌ పోర్ట్‌ లేదా, ఎయిర్‌ క్రాఫ్ట్‌ లో అఫెన్స్‌ జరిగితే విచారణ ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు. అన్‌ లా ఫుల్‌ అగనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఎవియేషన్‌ యాక్ట్‌ ప్రకారం సెక్షన్‌ 3(ఏ)కింద కేసు నమోదు చేయాలని, తమ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాకి గట్టిగా అక్షింతలు వేసిందని పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం రెండు చట్టాలను తొక్కిపెట్టినట్టు సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచామని వెల్లడించారు. విచారణను తమ పరిధిలోనే ఉంచుకుని నాటకాలు ఆడుతోందని, దీనికి కచ్చితంగా జవాబు చెప్పాల్సివుంటుందన్నారు. కేసు దర్యాప్తు కచ్చితంగా ఎన్‌ఐఏ పరిధిలోకి వెళుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.