జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ
తాహసిల్దార్ తీరుకు నిరసనగా ఆందోళన
విజయవాడ,జనవరి23(జనంసాక్షి): కృష్ణా జిల్లా కైకలూరులోని జర్నలిస్ట్లకు నివేశన స్థలాల పంపిణీలో తహశీల్దార్ తీరును నిరసిస్తూ జర్నలిస్టులు బుధవారం ధర్నా చేశారు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ల నివేశన స్థలాల పంపిణీ కైకలూరులో మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఎ కామినేని శ్రీనివాస్ చేతుల విూదుగా అందచేశారు. ఈ నేపథ్యంలో… కైకలూరు తహశీల్దార్ నిబంధనల పేరుతో సుమారు 11 మంది జర్నలిస్ట్లకు పట్టాలు మంజూరు చేయకుండా అడ్డుపడ్డారు. ఎంఎల్ఎ సానుకూలంగా ఉన్నా.. అసలైన జర్నలిస్ట్లను వదిలేసి అక్రిడిటేషన్ తెచ్చుకొని వార్తలు కవర్ చేయని వారికి పట్టాలు మంజూరు చేసిన తహశీల్దార్ తీరుపై అటు ప్రజలలోనూ, ఇటు జర్నలిస్ట్లలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. జర్నలిస్ట్లందరినీ సమదృష్టితో చూడాలంటూ… ప్రభుత్వం ఓ పక్క చెబుతున్నా, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్న జర్నలిస్ట్ల పట్ల తహశీల్దార్ తీరుని జర్నలిస్ట్స్లు ఖండిస్తూ నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం, ఎంఎల్ఎ కామినేని శ్రీనివాస్ లు తక్షణమే మిగతా జర్నలిస్ట్లకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ యూనియన్ డిమాండ్ చేసింది. తహశీల్దార్ తీరు మారకపోతే.. జర్నలిస్టులంతా జిల్లా వ్యాప్తంగా ధర్నా చేస్తారని హెచ్చరించారు.