జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్‌ శకం: ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి

జనగామ,మే2( జ‌నం సాక్షి): భవిష్యత్‌ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని, జాతీయ రాజకీయాల్లో రానున్నది తెలంగాణ రాష్ట్ర సమితి శకం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి జోస్యం చెప్పారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను గుర్తించి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా సానుకూలత వ్యక్తం అవుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తండాల్లోని గిరిజన సంక్షేమమే లక్ష్యంగా, గిరిజనులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశ్యంతో తాండలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యమైంది అన్నారు. 
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. చేతి వృత్తుల సంక్షేమం కోసం ఇంత వరకు ఏ ప్రభుత్వాలు పాటుపడలేదని అన్నారు. తెలంగాణను సమగ్రాభివృద్ధి దిశగా నడిపించేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలు అందించిన ప్రభుత్వం వాటికి బీమా సౌకర్యం వర్తింపజేయడంతో పాటు ఉచితంగా దాణా, సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందజేయడం హర్షణీయమన్నారు. గొర్రెలను విక్రయించకుండా ప్రభుత్వం అందించిన వాటితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు.