జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌పై వ్యక్తి కాల్పులు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్‌పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఖాలిద్ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. సంసద్ మార్గ్‌లోని కన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వెలుపల సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పార్లమెంటు స్ట్రీట్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్త మయ్యారు. ఆగంతకుడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉమర్ ఖాలిద్ సన్నిహితుడు ఒకరు దీనిపై మాట్లాడుతూ, తామంతా టీ స్టాల్ వద్ద ఉండగా, తెల్లచొక్కా ధరించిన వ్యక్తి  అందర్నీ తోసుకుంటూ వచ్చి కాల్పులు జరిపాడని, ఖాలిద్ బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో బుల్లెట్ గురితప్పిందని చెప్పారు. ఆంగతకుడ్ని పట్టుకునేందుకు తాము ప్రయత్నించగా అతను గాలిలో కాల్పులు జరిపాడని, పిస్తోలు చేతుల్లోంచి జారిపడటంతో అతను పరారయ్యాడని తెలిపారు.