టిడిపికి తిరుగు లేదన్న చంద్రమోహన్‌ రెడ్డి

వైకాపా పని అయిపోయిందని వ్యాఖ్య
నెల్లూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : వైకాపా ఎంతగా దాడులకు దిగినా, హత్యారాజకీయాలకు పాల్పడ్డా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, ప్రజల అండదండలే తమకు శ్రీరామరక్ష అని మాజీమంత్రి,టిడిపి సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఆయన కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అంతా ఆరోగ్యంగా ఉండాలని, కరోనా నుంచి విముక్తి పొందాలని అన్నారు. అలాగే పాలకులకు భగవంతుడు మంచి బుద్ది ఇవ్వాలన్నారు. మంచి కార్యాక్రమాలు, అభివృద్ది చేస్తున్నంత వరకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరోగమన రాష్ట్రంలో వైకాపా పూర్తిగా నిర్వీర్యం అయిపోతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ అజెండాగా విపక్షంగా తమవంతు పాత్ర నిర్వహిస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెదేపాకు తిరుగులేదని వచ్చే ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరంను పూర్తిచేసి ఏపీని సస్యశ్యామలం చేస్తామన్న వైకాపా దానికి సంబంధించి పనులను పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం పూర్తయ్యేలోపు కృష్ణా డెల్టాను ఆదుకోవాలని పట్టిసీమ ప్రాజెక్టును నాటి సిఎం చంద్రబాబు నిర్మించామని చెప్పారు. వైసీపీ అన్నింటినీ అడ్డుకోవాలని చూసిందని, అయినా సరే అనుకున్న పనులు పూర్తిచేసామని చెప్పారు. అమరావతి విషయంలో వైకాపా ఇప్పటికైనా తన విధానాలు మార్చుకోవాలన్నారు.