టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్కు ఘనంగా వీడ్కోలు
నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రవీందర్, హమీద్
హైదరాబాద్,మార్చి 30(జనంసాక్షి) : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు చెందిన హవిూద్ ను ఎన్నుకున్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేశారు. టీఎన్జీఓస్ అధ్యక్షునిగా ఉన్న సందర్భంలో దేవీప్రసాద్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. జేఏసీలో కీలకనేతగా సకలజనుల సమ్మె విజయవంతం కావటానికి తీవ్ర కృషి చేశారు. పలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన దేవీప్రసాద్ ఇటీవల తెలంగాణ సర్కారు ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించటంలో కీలక పాత్ర పోషించారు. దేవీప్రసాద్కు టీఎన్జీఓ ఉద్యోగ సంఘం ఘనంగా వీడ్కోలు పలికింది.