టీడీపీ ఎంపీలు ఆంధ్రా మాల్యాలు
– మహాకూటమికి ఓటమి తప్పదు
– భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
విజయవాడ, నవంబర్29(జనంసాక్షి) : టీడీపీ ఎంపీలు ఆంధ్రా మాల్యాలు అని ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. గురువారం విజయవాడలో విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి ఓటమి తప్పదన్నారు. వందల కోట్ల పన్నులు ఎగవేసిన వ్యక్తి రాహుల్ అని పేర్కొన్నారు. ఏపీలో చేసిన అక్రమాల నుంచి బయటపడటం కోసమే చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కట్టారన్నారు. టీడీపీ ఎంపీలు ఆంధ్రా మాల్యాలని విమర్శించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ల చరిత్ర పరిశీలిస్తే అది అర్థం అవుతోందన్నారు. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి జల్సా జీవితం గడుపుతున్నారని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు ఇలా ఎగవేతలకు పాల్పడటం దారుణమని, రాజకీయ ముసుగులో దందాలు చేస్తున్న వీరికి సీఎం చంద్రబాబు అండగా ఉండటం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సుజనా, సీఎం రమేష్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీకి లేఖ రాసానని జీవీఎల్ తెలిపారు. సిట్, సీఐడీలు డీపీని కాపాడే విధంగా పనిచేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దొంగలైనా కూడా దొరల్లాగా ప్రవర్తిస్తారని, టీడీపీది దగుల్భాజీ రాజకీయం చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు బహిష్కరిస్తారని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఓటమి ఖాయం, ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో కనుమరుగే అని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, అందుకే ఎన్నికల తర్వాత మళ్ళీ పార్టీలన్నీ కలిసే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ తెలిపారు.