ట్యాక్సీలోకి చొరబడి 31మంది హత్య

అంటాననారివో: మడగాస్కర్లో దారుణం చోటుచేసుకుంది. 31మంది ప్రయాణీకులను బందిపోట్లు అతి దారుణంగా హత్య చేశారు. ప్రయాణిస్తున్న వారిని దారి మధ్యలో అడ్డుకొని ఈ ఒళ్లుగగుర్పొడిచే సంఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బుష్ ట్యాక్సీలో తోలియారా అనే ప్రాంతం నుంచి బెరోరోహ అనే ప్రాంతానికి 32మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.

అలా ప్రయాణిస్తుండగా ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 20మంది బందిపోట్లు రోడ్డు మధ్యలో అడ్డంకి సృష్టించారు. అయితే, వారిని తప్పించేందుకు డ్రైవర్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారు తుపాకీతో ముందు టైరు పేల్చి వాహనాన్ని నిలిపేశారు. అనంతరం అందులోకి చొరబడి అత్యంత పాశవికంగా హత్య చేశారు. చనిపోయినవారిలో పదిమంది చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే ఒక్కరు తీవ్రంగా గాయాలపాలై కొన ఊపిరితో ఉన్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది.