ట్యూషన్ మాష్టారు దాష్టీకం
ఆడపిల్లలపై లైంగికదాడి
ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
భువనేశ్వర్,ఆగస్ట్1(జనం సాక్షి): ఆడపిల్లలపై లైంగికదాడికి యత్నించిన ఓ ట్యూషన్ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఒడిషాలో జరిగింది. ట్యూషన్ కోసం వస్తున్న అయిదుగురు విద్యార్థినులపై మూడు నెలలుగా లైంగిక దాడి చేస్తున్న ఆరోపణలపై బుధవారం పోలీసులు రబీంద్ర సాహు అనే ట్యూషన్ మాస్టారును అరెస్టు చేశారు. దేవ్గఢ్ జిల్లా కండాయిగొల ఠాణా పరిధిలో తాలొసర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కండాయిగొల ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రబీంద్ర సాహు ట్యూషన్లు చెబుతుండేవాడు. గ్రామానికి చెందిన 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ట్యూషన్ కోసం ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన వారిలో కొందరికి చదువు చెప్పకుండా లైంగికంగా దాడి చేసేవాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని వారిని బెదిరించేవాడు. బుధవారం ఒక విద్యార్థిని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.