ట్రంప్ ను ప్రశ్నిస్తా – ఒబామా
దేశాధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అమెరికా రాజకీయాలపై స్పందిస్తానని బరాక్ ఒబామా అన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా విలువలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంటే, ఆ దశలో ఒక సాధారణ పౌరుడిగా తాను దేశాధ్యక్షున్ని ప్రశ్నిస్తానని ఒబామా అన్నారు. పెరూ రాజధాని లిమాలో జరిగిన అపెక్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అమెరికా దేశాధ్యక్షులు తమ పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటారు. తమ వారసులపై కామెంట్ చేసేందుకు కూడా నిరాకరిస్తారు. కానీ ఒబామా మాత్రం ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడారు. ఒక ప్రైవేట్ పౌరుడిగా తాను దేశ పరిస్థితులపై స్పందిస్తానన్నారు. వైట్హౌజ్ పట్ల తనకు గౌరవం ఉందని, కొత్త అధ్యక్షుడు తన ఆలోచనలను, అభిప్రాయాలను అమలు చేసేందుకు తాను అనుకూలంగా వ్యవహరిస్తానన్నారు. అయితే దేశీయ విలువులు, లక్ష్యాలకు ఎటువంటి ప్రమాదం ఏర్పడినా, అలాంటి ఘటనల పట్ల రియాక్ట్ అవుతానని ఒబామా అన్నారు.