డ్రగ్స్‌ మత్తులో కారు డ్రైవింగ్‌

 

 

 

బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్‌

ముంబయి,జూలై24(జ‌నంసాక్షి): విలాసవంతమైన కారు చేతిలో ఉన్నా డ్రగ్స్‌ ప్రభావం మత్తులో అత్యంత వేగంగా కారును నడిపి అదుపు చేయడంలో విఫలమై రోడ్డుపై ఓ వ్యక్తి విధ్వంసం సృష్టించాడు.

ముంబయిలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నగర్‌లో జాగ్వార్‌ కారుతో విధ్వంసం సృష్టించాడు . అత్యంత వేగంగా కారును నడుపుతూ కారు వేగాన్ని అదుపుచేయలేక పక్కనే పార్కింగ్‌ లో ఉన్న కార్ల పైకి ఎక్కించాడు. మొదటగా ఓ కారును ఢీకొట్టి, అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పార్కింగ్‌లో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో 12 కార్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు కారు డ్రైవర్‌ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను వాహనాల ఎయిర్‌ కండీషనింగ్‌ కంపెనీ డైరెక్టర్‌గా గుర్తించారు. అతను డ్రగ్స్‌ తీసుకున్నాడని, ఆ మత్తులోనే కారు నడిపాడని పోలీసులు తెలిపారు.