తమిళనాట మరో ఘాతుకం
మైనర్ బాలికపై నెలలుగా సామూహిక అత్యాచారం
ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
ఇప్పటి వరకు 17మంది అరెస్ట్
చెన్నై,జూలై17(జనం సాక్షి): అత్యాచార పర్వంలో మరో పేజీ లిఖితమయ్యింది. మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా నెలలపాటు అత్యాచారం కొనసాగించారు. చివరకు ఆ మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఘాతుకం వెలుగు చూసింది.తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో 11ఏళ్ల బాలికపై ఆ భవనంలోని పలువురు వ్యక్తులు కొన్ని నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 17మందిని అరెస్ట్ చేశారు. భవనం సెక్యురిటీ గార్డు, లిప్ట్ బాయ్, నీళ్లు సరఫరా చేసే వ్యక్తులు కూడా అరెస్ట్ చేసిన వారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి కిరాతకానికి పాల్పడ్డారని, తర్వాత ఆమెను బెదరించారని తెలిపారు.ఏడో తరగతి చదువుతున్న చిన్నారి తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి తన సోదరికి వెల్లడించగా ఆమె వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగు చూసింది. దీంతో బాలిక తల్లి సోమవారం పోలీసులను ఆశ్రయించారు. కొన్ని నెలల పాటు పలువురు వ్యక్తులు బాలికపై అపార్ట్మెంట్ కాంపౌండ్ లోపల వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి ఈరోజు 17మందిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటనపై మహిళా సంగాలు మండిపడ్డాయి. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.