తిరుమలలో నేడు దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టిటిడి

తిరుమల,నవంబర్‌6(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా బుధవారం నాడు దీపావళి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య దీపావళి రోజు యథాప్రకారంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలలను టీటీడీ రద్దు చేసింది. అయితే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక సుప్రభాతం మరియు సహస్రదీపాలంకార సేవలకు యథావిధిగా గృహస్థ భక్తులను అనుమతిస్తారు. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోనికి

వస్తారు. ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై క్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.