తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే
` దళిత గిరిజనులకు పెద్దపీట..
` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు
` రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు
` అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సి, ఎస్టి కుటుంబాలకు రూ.12 లక్షలు
` పదో తరగతి పాస్‌ అయితే రూ.10వేలు
` 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌
చేవెళ్ల(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హావిూలు అమలు చేస్తామని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభకు ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారని విమర్శించారు. సోనియాతో ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాట మార్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలను మోదీ ఎన్నిసార్లు తిడతారని ప్రశ్నించారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని నిలదీశారు. నెహ్రూ, పటేల్‌ కలిసి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేశారని గుర్తు చేశారు. 53 ఏళ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని గుర్తు చేశారు.’’ఆహార భద్రత చట్టాన్ని మేమే తెచ్చాం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారు? మేం చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. భూ సంస్కరణలు అమలు చేసి జవిూందారీ వ్యవస్థను నిషేధించాం. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. నరేగా చట్టం తెచ్చింది ఎవరు?. హైదరాబాద్‌కు అనేక సంస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇచ్చింది. దేశంలోని ప్రముఖ కంపెనీలను కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందంటే రాజీవ్‌గాంధీనే కారణం. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయి.మేం చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65శాతమైంది. విద్యా, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టాం.దేశాన్ని ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం. ప్రజల మేలు కోసమే కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుంది. దేశ ఐక్యతకు కృషి చస్తూ ఇందిర, రాజీవ్‌ ప్రాణాలు వదిలారు’’ అని మల్లికార్జున ఖర్గే వివరించారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిని అయ్యానన్నారు. కేసీఆర్‌.. బయట భాజపాను తిడతారు, లోపల మంతనాలు జరుపుతారని విమర్శించారు. సభావేదికపై ఏర్పాటు చేసిన గద్దర్‌ చిత్రపటానికి ఖర్గే పూలమాల వేసి నివాళులర్పించారు. ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యకర్తలు భారీగా రావడంతో చేవెళ్ల`శంకర్‌పల్లి మార్గంలో కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలివే..
అంబేడ్కర్‌ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షలు ఇస్తాం. కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తాం. పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు ఇస్తాం. రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు, 9 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాం.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్‌ అయితే రూ.10వేలు, డిగ్రీ పాస్‌ అయితే రూ.25వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ పూర్తి చేసిన వారికి రూ.5 లక్షలు ఇస్తాం. ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.
గ్రాడ్యుయేషన్‌, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తాం. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం.ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.ప్రతి తండా గ్రామపంచాయతీకి ఏటా రూ.20 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్లకు రూ.750 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్లకు రూ.500 కోట్లు ఇస్తాం. విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయం చేస్తాం