తెలుగుజాతి కోసమే.. శత్రువుతో చేతులు కలిపా


– దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి
– ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసింది
– అందుకే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నాం
– కేసీఆర్‌ ఎందుకు తిడుతున్నాడో అర్థం కావటం లేదు
– ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఓర్చుకుంటా
– తెలుగు రాష్ట్రాల అభివృద్ధే నాకు ముఖ్యం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
గుంటూరు, నవంబర్‌26(జ‌నంసాక్షి) : కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు తెలిపారు.
సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్నవారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని, కేంద్రం ప్రభుత్వానికి అసహనం పెరిగిందని చంద్రబాబు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనపై చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే.. కేసీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని అన్నారు. ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తనతోనే ఉన్నారని,  తన అనుచరుడుగా ఉన్నారని, ఇప్పుడు తిడుతూ ఉంటే బాధనిపించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. తననే తిడుతున్నారని బాధేస్తోందని అయినా ఫర్వాలేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని.. మైక్రోసాఫ్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డ, ఎయిర్‌ పోర్టు.. ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. కేసీఆర్‌ ఎన్ని విమర్శలు చేసినా… తెలుగు రాష్ట్రాల అభివృద్ధినే తాను కోరుకుంటానన్నారు.