త్రిపుర గవర్నర్‌ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు

ముందే సంతాపం ప్రకటించడంపై ఆగ్రహం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇక లేరంటూ త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌ ట్వీట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. క్షణాల్లో ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో నాలిక్కరుచుకున్న ఆయన వెంటనే సదరు ట్వీట్‌ను తొలగించి క్షమాపణ చెప్పారు. క్షమించండి. ఓ ఆలిండియా టీవీ చానెల్‌లో వచ్చిన వార్తలను చూసి నేను అలా ట్వీట్‌చేశాను. ముందు అది నిజమా కాదా అనేది తెలుసుకుని ఉండాల్సింది. వాజ్‌పేయిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నా ట్వీట్‌ను డిలీట్‌ చేశాను. మరోసారి క్షమించాలని కోరుతున్నాను..’ అని పేర్కొన్నారు. కాగా వాజ్‌పేయి ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందనీ… వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.