త్వరలో అందరికీ అందుబాటులో డ్రోన్ సేవలు!
– పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే
న్యూఢిల్లీ, జులై19(జనం సాక్షి) : ప్రస్తుతం నిషేధిత జాబతాలో ఉన్న డ్రోన్ సేవలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా డ్రోన్ సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. మానవ రహిత వైమానిక వాహనాలకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. సామాన్య పౌరులు డ్రోన్లు వాడకుండా ప్రస్తుతం డీజీసీఏ ఆంక్షలు కొనసాగిస్తోంది. డ్రోన్ల నమోదు, వాడకానికి సంబంధించిన అనుమతుల కోసం ప్రజలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. అక్టోబర్ నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.