*త్వరలో గురప్ప వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతాం*

– నిర్మాణానికి ఎమ్మెల్యే బొల్లం ఆర్థిక సహాయం
– టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొగరు రమేష్

మునగాల, అక్టోబర్ 02(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామ శివారులోని గురప్ప వాగుపై శనివారం జరిగిన సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరమని మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గత రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో గురప్ప వాగు విషయమై చర్చించారని, త్వరలోనే గుర్రప్ప వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తన సొంత నిధులలో నుండైనా కొంత కేటాయించి నిర్మాణం చేపడతారని తెలియజేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి ఎత్తు తగ్గించడం వల్ల ఎన్నడు లేనివిధంగా నీళ్లు రావడంతో నాలుగు సంవత్సరాలుగా గురప్ప వాగుపై రాకపోకల అంతరాయం కలుగుతుందని బాధను వ్యక్తం చేశారు. కానీ కొంతమంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే ఈ అంశాన్ని మరలా టిఆర్ఎస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులంతా కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంతేకాకుండా వాగులో కొట్టుకుని పోయి మరణించిన అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతని కుటుంబ సభ్యులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.