దమ్ముంటే అందరం రాజీనామ చేద్దాం

అప్పుడు ప్రజల్లోకి వెళితే ఎవరు గెలుస్తారో చూద్దాం: మాణిక్యాలరావు

ఏలూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): మిత్రపక్షంగానే పోటీ చేసి అందరమూ గెలిచాం…దమ్ముంటే ఎవరికి వాళ్లు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేద్దాం రండి.. అని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు సవాల్‌ విసిరారు. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రజలు మెజారిటీ ఇచ్చారని వారి కోసం విూరేం చేశారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేయండి.. ప్రజలే నిర్ణయిస్తారు. కేవలం తమనే రాజీనామా చేయాలని అడిగే హక్కు టిడిపి వారికి లేదన్నారు. ప్రజలకు ఏవిూ చేయకుండా ఏదో చేశామనిచెప్పుకుంటే విశ్వసించడానికి ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. తాను మంజూరు చేయించిన పనులకు కూడా టీడీపీ నేతలే శంకుస్థాపనలు చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం కోసం మంజూరైన రూ.90 లక్షలు కేంద్ర నిధులే..రాష్ట్ర నిధులు ఏవిూ లేవు. తహసీల్దార్‌ కార్యాలయ శంకుస్థాపన కూడా టీడీపీ నాయకులే చేశారు. అన్న క్యాంటీన్‌ నేను అడ్డుకున్నానని ఆరోపిస్తున్నారు. నేను అడ్డుకోవడమేమిటి..? రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన క్యాంటీన్‌ కనీసం 300 మందికి కూడా భోజనం పెట్టలేని పరిస్థితి ఉంది.. అందుకే దానిపై నాకు అసంతృప్తి ఉంది.. నేను మిత్రపక్షంలో ఉన్నప్పుడు కూడా అవినీతిపై ప్రశ్నించానని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, యెగ్గిన నాగబాబు, నరిసే సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.