దుండగులు సిమీ సభ్యులే

5
సర్కారు అధికారిక ప్రకటన

ఘటనా స్థలానికి జాతీయ దర్యాప్తు సంస్థలు

హైదరాబాద్‌/నల్గొండ,ఏప్రిల్‌5(జనంసాక్షి): జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు దుండగులు సిమీ కార్యకర్తలేనని డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. సూర్యాపేట కాల్పులకు బాధ్యులైన ఈ ఇరువురు దుండగులు గత కొంత కాలంగా తెలంగాణ, ఏపీల్లో దారిదోపిడీలకు పాల్పఞడుతున్నట్లు నిర్థారించారు. కాగా నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), యాంటీ టైరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు ఆదివారం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జానకీపురం గ్రామానికి చెందిన కొందరిని విచారించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముంబైకి చెందిన ఏటీఎస్‌ టీం జానకీపురం వెళ్లింది. వారి వెంట జిల్లాకు చెందిన ఒక సీఐ, ఎస్‌ఐతో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. సాయంత్రం సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు కూడా తమ దర్యాప్తునకు అవసరమైన వివరాలను సేకరించి వెళ్లారు. మరోవైపు ఘటనాస్థలానికి మధ్యప్రదేశ్‌, కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు కూడా వచ్చి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి పరారైన దుండగులు వీరేనన్న సమాచారంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. మరోవైపు కర్ణాటకలో విధ్వంసం సృష్టించటానికి ప్రణాళికలు రూపొందించిన ముఠా సభ్యులు వీరేనన్న కోణంలో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మన రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్‌ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాగా, దుండగుల మృతదేహాలను ఉంచిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి వద్దకు కూడా ఏటీఎస్‌ బృందాలు వచ్చి వెళ్లాయి. అత్యంత గోప్యంగా అధికారులు ఆసుపత్రిలోనికి వెళ్లి తమకు అవసరమైన సమాచారం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీ సుధీర్‌లాక్టాకియా, ఐజీ నవీన్‌చంద్‌, ఎస్పీ ప్రభాకరరావులు కూడా దుండగుల మృతదేహాలను పరిశీలించి వెళ్లినట్టు తెలుస్తోంది.