ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు
ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ తేదీన రానుంది. దీంతో శ్రీకృష్ణుడి పుట్టిపెరిగిన ద్వారకలో ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ప్రసలు సిద్దం అవుతున్నారు. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నయ్య ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ పండుగ సంబరాలను మధుర, బృందావన్‌ నుంచి ఇస్కాన్‌ వరకు విభిన్నమైన వాతావరణాన్ని.. వేడుకల వైభవాన్ని చూడవచ్చు. అయితే శ్రీ కృష్ణుడు ఏలిన నగరమైన ద్వారకలో మాత్రం అన్ని ఆలయాలకు భిన్నంగా వేడుకలు జరుగుతాయి. జన్మాష్టమికి కొన్ని రోజుల ముందుగానే ద్వారకను అందంగా అలంకరించారు. ముక్తి నగరంగా పిలువబడే ద్వారక నవ వధువు కంటే తక్కువ కాదు. హిందూ క్యాలెండర్‌ ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమిని శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిధిని జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ద్వారకలో కృష్ణ జన్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ద్వారక భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో ఉంది. ఇక్కడ జన్మాష్టమి పండుగ చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలనుకుంటే జన్మాష్టమి రోజున ద్వారకకు తప్పకుండా వెళ్ళాల్సిందే.. కన్నయ్య దర్శనం కోసం లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విగ్రహాన్ని విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. రాత్రి ఆభరణాలతో అలంకరించి దాదాపు అరగంట తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ భక్తులు దర్శించలేరు. రాత్రి 12 గంటలకు కన్నయ్య కు స్వాగతం పలుకుతారు. దాదాపు 2 గంటల తర్వాత రాత్రి 2 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
అనంతరం ఉదయం 7 గంటలకు మంగళ హారతితో శ్రీకృష్ణుని పూజలు ప్రారంభమవుతాయి. కన్నయ్యకు భోగ్‌ సమర్పించి తెరను తొలగిస్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ద్వారకకు వస్తుంటారు. దహీ హండీ, జాయ్‌ రైడ్‌ల సహా ఎన్నో రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఇక్కడ ఏర్పాటు
చేయబడ్డాయి.