ధర్మపోరాట దీక్షతో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు

విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి): విజయనగరంలో సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా మంగళవారం విజయనగరంలోని ఆర్టీసీ బస్సులన్నీ ముందే బుక్‌ చేశారు. దీంతో బస్సులు లేక ఆర్టీసీ కాంప్లెక్స్‌లన్నీ వెలవెలబోయాయి. నగరంలోని వందల సంఖ్యల్లో ఆర్టీసీ బస్సులన్నీ టిడిపి కార్యకర్తల్ని తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణీకులు ఇక్కట్లపాలయ్యారు. ప్రయాణీకులంతా వేరే మార్గాలు వెతుక్కోవడంతో..ఆర్టీసీ కాంప్లెక్స్‌లన్నీ ఉసూరుమంటున్నాయి. తప్పని పరిస్థితైన ప్రయాణీకులు అలాగే బస్టాండ్‌లలో నిరీక్షిస్తున్నారు. అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సులు మాయమవడంతో విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటివి చోటు చేసుకోవడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ సిఎం సేవలో బిజీ అయిపోయాయి. విజయనగరం చిన్నారులు, ప్రయాణీకులు ఇక్కట్లు పడ్డారు.