నదీజలాలపై చర్చకు సిద్ధం

` బీఆర్‌ఎస్‌ నీటి సెంటిమెంట్‌ను తిప్పికొడదాం
` ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది
` సభలో ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చేందుకు సమాయత్తం కావాలి
` సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ముఖ్యం
` ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలి
` మంత్రులకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం
హైదరాబాద్‌(జనంసాక్షి): భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రులతో సీఎం భేటీ నిర్వహించారు. సభలో ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలన్నారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని సూచించారు. సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ముఖ్యం అన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలన్నారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. దీనికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు చేయనున్నారు. అసెంబ్లీలో తమ స్టాటజ్రీపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు కాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజున దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డిదామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్‌ జీరో అవర్‌ నిర్వహించారు. శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్‌ పీర్‌ షబ్బీర్‌లకు సంతాపం ప్రకటించారు. అనంతరం బీఎస్టీ సవరణల ఆర్డినెన్స్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మొదటి, రెండో సవరణల ఆర్డినెన్స్‌లు, పురపాలక సంఘాల సవరణల ఆర్డినెన్స్‌, తెలంగాణ సమగ్ర శిక్షా ఆడిట్‌ నివేదిక, పీఎం స్కూల్‌ రైజింగ్‌ ఇండియా ఆడిట్‌ రిపోర్ట్‌లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉభయ సభల్లో ప్రవేశ పెట్టారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణల ఆర్డినెన్స్‌లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉభయ సభల్లో ప్రవేశ పెట్టారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ సవరణల ఆర్డినెన్స్‌ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఉభయసభల్లో ప్రవేశ పెట్టారు. ఆయా ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చిన సవరణలకు చట్టబద్దత కల్పించేందుకు ప్రస్తుత సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్‌ జీరో అవర్‌ నిర్వహించారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐలకు చెందిన సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటలు శాసనసభ సాగింది.

ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం
` కేసీఆర్‌ను ఇవాళే కాదు.. ఆసుపత్రిలో కూడా కలిశా
` కేసీఆర్‌ వెంటనే ఎందుకు వెళ్లారన్నది ఆయననే అడగాలి
` బడ్జెట్‌ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలనుకుంటున్నాం
` అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో విూడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్‌ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్‌, తాను మాట్లాడుకున్నది విూకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు.అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే కేసీఆర్‌ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇక.. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు.