నాల్గో విడత హరితహారంను.. 

ఉద్యమంలా చేపట్టాలి
– మేడ్చల్‌ జిల్లాలో 47లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
– మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
– దసరా నాటికి కలెక్టరేట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం
– మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
మేడ్చల్‌, జులై5(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా చేపడుతుందని, ప్రతీ ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కీసర మండలం రాంపల్లి వద్ద ఉన్న దయారా హరితహారం నర్సరీని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నందారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ భాస్కర్‌ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కోటి 87 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని, వీటిల్లో మేడ్చల్‌ జిల్లాలోనే 47 లక్షల మొక్కలు నాటబోతున్నామని తెఇలపారు. వర్షాలు కురియగానే నాలుగో విడత హరితహారంలో భాగంగా ఉద్యమంలా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను వంద శాతం బతికించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని చెప్పారు. హరితహారం తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కావాలన్నారు. రైతుబీమా, రైతుబంధు పథకాలు.. రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టారని మంత్రి స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను దసరా నాటికి పూర్తి చేస్తామని మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌ పనులను  పరిశీలించారు. రూ. 52.50 కోట్లతో మేడ్చల్‌ కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. దసరాకు కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభించే విధంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను సీఎం ఏర్పాటు చేశారని మంత్రి స్పష్టం చేశారు.