నిప్పులు చిమ్ముతూ నింగికి…

C

– వినువీధుల్లో మహాఅద్భుతం

– ఇస్రో చరిత్రలో మరో మైలురాయి

– ఏకకాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన సత్తా

– అభినందించిన ప్రధాని

శ్రీహరికోట,జూన్‌ 22(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రోదసీలో మరో చరిత్ర సృష్టించింది. తన విజయపరంపరలో మరో పుటను లిఖించింది. అగ్రదేశాలకు దీటుగా పరిశోధనలు చేసి సగర్వంగా వినీలాకశాంలో భారత్‌ పతాకను రెపరెపలాడించింది. ఒకే రాకెట్‌ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి సత్తా చాటింది. బుధవారం ఉదయం 9.26గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో ప్రధానమైనది కార్టోశాట్‌-2సి. దీని బరువు 727.5 కిలోలు, 20 ఉప గ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు, గూగుల్‌కు చెందిన 110 కిలోల స్కైశాట్‌ కూడా వీటిలో ఉంది. పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసింది. నింగిలోకి చేరిన పీఎస్‌ఎల్‌వీ ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పట్టింది. పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంత కావడంతో శాస్త్రవ్తేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంసీసీ నుంచి ఇస్రో అధిపతి కిరణ్‌కుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు.ఈ ప్రాజెక్టుపై యావత్తు దేశం పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది ఇస్రో టీమ్‌. ప్రయోగం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, టీఎస్‌ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.   ఇస్రో బుధవారం ప్రయోగించిన కార్టోశాట్‌-2సి ఉపగ్రహం దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపచేయనుంది. ఇది నిఘాకు సంబంధించి ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్‌ వద్ద మాత్రమే ఉన్నాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో

దాన్ని సాకారం చేసింది.  ఇది అంతరిక్షం నుంచి అత్యంత కచ్చితమైన చిత్రాలు, వీడియోలను తీసి, భూమికి చేరవేస్తుంది. ఇందులో ప్యాన్‌క్రొమాటిక్‌ కెమెరా, మల్టీస్పెక్టల్ర్‌ పరికరం వల్ల ఈ సామర్థ్యం ఒనగూరింది. గతంలో పంపిన కార్టోశాట్‌- 2, 2ఎ, 2బి ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 విూటర్ల కచ్చితత్వం ఉంది.  ప్రస్తుతం పంపే కార్టోశాట్‌-2సిలో దాన్ని మరింత ఆధునికీకరించి, 0.65 విూటర్ల కచ్చితత్వం సాధించేలా రూపొందించారు.  కార్టోశాట్‌-2సి ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది.  కార్టోశాట్‌-2సిలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు.  పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీరప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి, భూవినియోగతీరుపై మ్యాప్‌లు తయారుచేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు.  దీని రూపకల్పనకు అయిన వ్యయం రూ.350 కోట్లు. ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది.  2014 జులై 19న రష్యాకు చెందిన డీఎన్‌ఈపీఆర్‌ రాకెట్‌ 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు.  తర్వాతి స్థానం అమెరికాదే. ఆ దేశానికి చెందిన మినోటార్‌-1 రాకెట్‌ 2013 నవంబర్‌ 19న ఒకేసారి 29 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. భూ పరిశీలన కోసం రూపొందించిన కార్టోశాట్‌ -2తో పాటు తమిళనాడు సత్యభామ యూనివర్శిటీ విద్యార్థులు తయారు చేసిన సత్యభామ శాటిలైట్‌ను, పుణె ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రూపొందించిన స్వయంశాట్‌ను రోదసిలో విజయవంతంగా దింపింది. అలాగే అమెరికాకు చెందిన డవ్‌ అనే 12మైక్రో శాటిలైట్స్‌, స్కైశాట్‌ జెన్‌ 2-1 అనే మరో శాటిలైట్‌, కెనడాకు చెందిన 2శాటిలైట్స్‌, జర్మనీకి చెందిన బైరోస్‌ శాటిలైట్‌, ఇండోనేషియాకు చెందిన లపన్‌-ఎ3 శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేరవేసింది. భూ పరిశోధన కోసం కార్టోశాట్‌-2ను రూపొందించగా, సత్యభామశాట్‌ గ్రీన్‌హౌస్‌ వాయువుల సమాచారం సేకరించనుంది. అలాగే స్వయం శాట్‌ మేనేజింగ్‌ సర్వీస్‌ను అందించనుంది. స్కైశాట్‌ జెన్‌ -2 హైక్వాలిటీ వీడియోలు పంపనుండగా, అంతరిక్షంలో ఉష్ణోగ్రతలు లపాన్‌-ఏ3 తెలుపనుంది. అలాగే 12డవ్‌ శాటిలైట్లు భూమిని పరిశోధించ నున్నాయి. ఈ విజయంతో ఇస్రోలో సంబరాలు జరుపుకున్నారు. ప్రయోగాన్ని తిలకించేందుకు వచ్చిన విదేశీ శాస్త్రవేత్తలు ఇస్రో అధికారులకు అభినందనలు తెలిపారు.

ప్రధాని సహా పలువురు హర్షం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-34 విజయవంతం కావటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. 20 ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప గ్రహాలు రూపొందించడంలో పుణె, చెన్నైకు చెందిన విద్యార్థులు కీలక పాత్ర పోషించడం అభినందనీయం. శాస్త్రవిజ్ఞానంలో యువత ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

శ్రీహరికోటలోని షార్‌ నుంచి బుధవారం ఉదయం చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంతమైంది. బారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, విద్యాసంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలు, 17 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగం విజయవంతం పట్ల ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఒకే సారి 20 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం, మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.