నిర్బంధానికి భయపడం.. పోరు ఆపబోం

టీజేఏసి చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) :
నిర్బంధాలకు భయడమని తెలంగాణ పోరు ఆపబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం నాచారంలోని నోమా కల్యాణ మండపం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక నాలుగో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు తారస్థాయికి చేరుకుందని, దీనిని అణచివేయడం ఎవరితరం కాదన్నారు. ప్రజల నరనరాల్లో ఉద్యమ స్ఫూర్తి నిండిపోయిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యం పెత్తనం ఇకపై సాగబోవనే అనుమానంతోనే పాలకులు తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని తెలిపారు. వారి పెత్తనానికి, ఆధిపత్యానికి అడ్డు తగులుతున్నారనే సీమాంధ్ర సర్కారు ఉద్యమంలో హింసను చొప్పించి, ప్రజల గొంతుకు నులిమేయాలని చూస్తోందని మండిపడ్డారు. సీమాంధ్రుల ఆధిపత్యం కూలిపోవాలంటే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని అణచివేయాలని, ఉద్యమకారులను నిర్బంధించాలని కుయుక్తులు పన్నితే మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఉద్యమకారులు అనుభవాలను సమీక్షించుకొని భవిష్యత్‌కు మార్గనిర్దేశనం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోరు లక్ష్యం సిద్ధించే వరకు ఆగబోదని, పోరాటంపై  ప్రజలను ఎప్పటికప్పుడు జాగురూకం చేసేందుకు విద్యావంతుల వేదిక తన సేవలను మరింత విస్తృత పరచాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల   ఆకాంక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయంగా కన్పించి ఇప్పుడు అన్యాయమైనదిగా తోస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వమని చెప్పలేదు.. ఇస్తామని చెప్పలేదు లాంటి ఎటూ కాని మాటలు సీఎం లాంటి వ్యక్తులు మాట్లాడడం సమంజసంగా ఉండదని అన్నారు. ప్రజలను రెచ్చగొడితే తలెత్తే పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో  విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్యయ్య, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, పిట్టల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు