నిర్భయ కేసు దోషి వినయ్ శర్మలో మార్పు
చదువుకుని సంస్కారం అలవర్చుకున్న వినయ్ శర్మ
న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో 2012, డిసెంబర్ 16వ తేదీన ఓ వైద్య విద్యార్థిని నిర్భయను ఆరుగురు కలిసి అత్యంత దారుణంగా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడు వినయ్ శర్మలో ఎంతో మార్పు వచ్చింది. వినయ్ శర్మకు
కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆ శిక్ష అమలయ్యే వరకు తీహార్ జైల్లోనే శర్మ శిక్ష అనుభవించనున్నాడు. ఇతను రెండేళ్ల క్రితం జైల్లో.. డోస్ కు మించిన పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాంటి వినయ్లో ఎంతో మార్పు వచ్చింది. తరవాత ఉన్నత విద్యను పూర్తి చేశాడు. దీంతో జైలు జీవితం అనుభవిస్తున్న అతడు.. ఇగ్నో యూనివర్సిటీ నుంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో డిప్లొమా పూర్తి చేశాడు. జైల్లో ఏర్పాటు చేసిన చదువు, చదివించు అనే అక్షరాస్యత ప్రొగ్రాములో వినయ్ భాగమయ్యాడు. మిగతా ఖైదీలకు పాఠాలు బోధిస్తున్నాడు వినయ్. బేసిక్ మ్యాథ్స్తో పాటు రాయడం, చదివించడం నేర్పిస్తున్నాడు. పాఠాలు బోధించే సమయంలో బోర్డుపై ఒక నీతిసూక్తి రాసి ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు వినయ్ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా వినయ్ పెయింటింగ్ కూడా నేర్చుకొని అద్భుతమైన బొమ్మలు గీస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వినయ్ చిత్రాలు పలువురిని ఆకర్షించాయి. పెయింటింగ్పై దృష్టి పెట్టిన తర్వాత వినయ్లో మార్పు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు.