నిలిచిన విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌..

హైదరాబాద్‌: భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను  అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్‌ వద్ద రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2.30 గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీరు దొరక్క పోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సమీపంలోని స్టేషన్‌కైనా తీసుకెళ్లాలని కోరుతున్నారు.మహబూబాబాద్‌ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.కాగా, భారీ వర్షాలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని నిలిపివేశారు. విజయవాడ పరిధిలో 30 రైళ్లను అధికారులు రద్దుచేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో పలుచోట్ల రైల్వే ట్రాక్‌ ధ్వంసమవడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో ట్రాక్‌పైకి వరద చేరింది. దీంతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా-కావేరి, చార్మినార్‌, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్ధం హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు.