నెలరోజుల అస్త్రం విఫలమవడంతో
టీ కాంగ్రెస్ కొత్త బాణంరాజీనామా యోచనలో జైపాల్, జానా
చురుకుగా కదలకపోతే ఓటమి ఖాయమని మదన పడుతున్న నేతలు
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా గట్టెక్కాలనే యోచనలో పడ్డారు. ఏం చేస్తే ప్రజలకు చేరువవుతాం, ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి అనే విషయంలో వ్యూహ రచన ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలోనూ తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే.. బీరాలు పలికిన నేతలు తర్వాత అధిష్టానానికి విరవిధేయత ప్రకటించారు. కొందరైతే ప్రజల ఆకాంక్షనే అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారు. తమ అనుచరులతో తెలంగాణవాదులపై దాడులు చేయించారు. తెలంగాణపై వైఖరి చెప్పమన్న పాపానికి విద్యార్థులు, యువకులపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బయటికి తెలంగాణ అంటూనే ముఖ్యమంత్రికి నంగినంగి దండాలు పెడుతూ పదవులు దక్కించు కునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యమం ఎగసి పడుతున్న రోజుల్లో కేంద్రం మోసపూరిత వైఖరి చూసి తట్టుకోలేక కలత చెందిన విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసే కేంద్రంగా అవతరించిన ఉస్మానియా యూనివర్సిటీలోనూ బలిదానాలు జరిగాయి. అప్పుడు విద్యార్థులు శవాల సాక్షిగా తెలంగాణ సాధిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తర్వాత మంత్రిపదవులు తీసుకొని నోళ్లకు తాళం వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో అధినేత్రి సోనియాగాంధీ సాక్షిగా జై తెలంగాణ నినాదాలు చేసి ఎంపీలు ఉద్యమాన్ని పరిరక్షిస్తున్న వారిగా, ప్రజల పక్షాన గళం విప్పుతున్నవారిగా కనిపించారు. వారిలోనూకాంగ్రెస్ అధిష్టానం పదవుల చిచ్చుపెట్టింది. 2009లో ఉన్న కాంగ్రెస్ ఎంపీల గుంపు సగానికి సగం తగ్గిపోయింది. మిగతా వారిని అధిష్టానం బుజ్జగించి, భయపెట్టి తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ఈనేపథ్యంలో పార్లమెంట్లో చిల్లరవర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లును టీ కాంగ్రెస్ ఎంపీలు తమనుకూలంగా మలుచుకున్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తేనే బిల్లుకు మద్దతుగా ఓటేస్తామని ధిక్కార స్వరం వినిపించారు. వారి బెదిరింపులకు కాస్త లొంగినట్టు కనిపించిన అధిష్టానం మాట ఇచ్చినట్లుగా గతేడాది డిసెంబర్ నెలాఖరున అఖిలపక్షం నిర్వహించింది. సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లోగా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించారు. దీంతో టీ కాంగ్రెస్ నేతలు ఏదో సాధించామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ తన బుద్ధిని మార్చుకోలేదు. నెలంటే 30 రోజులు కాదని, మరిన్ని సంప్రదింపులు జరిపితే కాని తెలంగాణపై నిర్ణయం తీసుకోబోమని, అందుకు ఎంతో సమయం పడుతుందో చెప్పలేమని, ఇందుకు నిర్దిష్ట సమయేమి లేదని బాంబు పేల్చింది. దీంతో ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. వాళ్లూ వాటిని ఆమోదింపజేసుకోలేదు. పై పెచ్చు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని అధిష్టానం వెంటే ఉన్నామనే సంకేతాలు పంపారు. దీంతో వారిపై ప్రజల్లో ఉన్న సానుభూతి, తెలంగాణపై వారికి ఉన్నట్లుగా చెప్పుకునే చిత్తశుద్ధి సన్నగిల్లింది. ఇటీవల నిర్వహించిన సడక్బంద్ను భగ్నం చేసేందుకు పాలకులు ఎంతగా ప్రయత్నించినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో బతుకు భయం పట్టుకుంది. ప్రజలు తమను ఓడిస్తారేమోననే అనుమానంతో ఇప్పుడు కొత్తబాణం వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ సాధన కోసమంటూ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్రెడ్డి త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఆయనతో పాటే రాష్ట్ర మంత్రి కె.జానారెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించనున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంత మంది రాజీనామా చేయించి తామంతా తెలంగాణకు అనుకూలం అని చెప్పించుకునేలా ఓ కీకల నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అత్యున్నత స్థాయిలో పనిచేసే తెలంగాణవాదం బలంగా వినిపిస్తున్న సదరు నేతకు తర్వాతికాలంలో అధిష్టానం నుంచి నిరాదరణ ఎదురైంది. ఇప్పుడు మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించి పార్టీలో తన స్థానం చాటుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిని ధ్రువీకరిస్తూ సదరు నేత ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ‘మా పార్టీ అధిష్టానం తెలంగాణ అంశాన్ని కోల్డ్స్టోరేజీ ఉంచింది. దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మా వైపు నుంచి ఒత్తిడి పెంచేందుకు చివరి అస్త్రంగా జైపాల్, జానాతో రాజీనామా చేయిస్తామని’ ప్రకటించారు. కానీ ఈ ప్రకటనలో తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి కంటే 2014 ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యమే కనిపించింది.