నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు

` ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌
తిరువనంతపురం(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ఆటోబయోగ్రఫీ త్వరలో మార్కెట్లోకి రానుంది. ‘నిలవు కుడిచ సింహంగళ్‌ (వెన్నెలను తాగుతున్న సింహం)’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన జీవన ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే క్రమంలో తనకు ఎదురైన అనేక సవాళ్లను సోమనాథ్‌ వివరించారు.దీంతో ఇస్రో మాజీ చీఫ్‌ కె.శివన్‌ను ఉద్దేశిస్తూ సోమనాథ్‌ తన ఆత్మకథలో కీలక విమర్శలు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై తాజాగా స్పందించిన సోమనాథ్‌.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ‘‘ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ కొన్ని రకాల సవాళ్లను దాటాల్సి ఉంటుంది. నా జీవితంలోనూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక కీలక పదవి కోసం ఎక్కువ మంది అర్హులు అయి ఉండొచ్చు. ఆ విషయాన్నే నేను పుస్తకంలో ప్రస్తావించాను. అంతేగానీ.. నేను ఏ వ్యక్తినీ టార్గెట్‌ చేసి విమర్శలు చేయలేదు’’ అని సోమనాథ్‌ స్పష్టం చేశారు.