పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
– షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా
– మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పరీక్షల నిర్వహణ
– 91 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని వెల్లడి
అమరావతి, డిసెంబర్3(జనంసాక్షి) : ఏపీలో పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు సోమవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకారం మార్చి 18నుంచి ఏప్రిల్ 2వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 7వరకు అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
పరీక్షల కోసం ఇప్పటి వరకు మొత్తం 6.10లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
పరీక్షల షెడ్యూలు..
మార్చి18న ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు(పేపర్-1), 19న ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-2), 20న సెకండ్ లాంగ్వేజ్- హిందీ, 21న థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-1), 22న థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-2), 23న మ్యాథమెటిక్స్ (పేపర్ -1), 25న మ్యాథమెటిక్స్ (పేపర్-2), 26న ఫిజికల్ సైన్స్ (పేపర్ -1), 27న
బయాలాజికల్ సైన్స్ (పేపర్-2), 28న సోషల్ స్డడీస్ (పేపర్-1), 29న సోషల్ స్డడీస్ (పేపర్-2) పరీక్షలు జరగనున్నాయి.