పారదర్శకంగా ఆర్మీ ఎంపికలు: కలెక్టర్‌

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో చేపట్టనున్న ఆర్మీ ఉద్యోగ ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని కలెక్టర్‌ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం జేఎన్‌ఎస్‌ ఇండోర్‌ స్టేడియంలో వివిధ జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 22 వ తేదీ నుంచి 31 తేదీ వరకు జరిగే సైనిక ఉద్యోగ ఎంపికలకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలపై చర్చించారు. అనంతరం బాడ్మింటన్‌, లాన్‌ టెన్నిస్‌, హ్యాండ్‌ బాల్‌కోర్టులతోపాటు జేఎన్‌ఎస్‌ ప్రధాన క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభపెడితే అభ్యర్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీ రవీందర్‌, ఆర్మీ అధికారి పవన్‌, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
—-