పార్లమెంట్‌లో జయదేవ్‌ నోట ‘భరత్‌’ మాట!

న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతి మేరకు తన ప్రసంగాన్ని ప్రారంభించిన జయదేవ్‌.. మొదటిగా తమకు సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎంపికైన తానకు అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించే అవకాశం ఇచ్చిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తొలిసారి ఎంపీగా ఎంపికైన ఎవరూ గతంలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించలేదని, ఇది తనకు దక్కిన గౌరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్దానం గురించి చెబుతూ ‘భరత్‌ అనే నేను’ సినిమాను జయదేవ్‌ ప్రస్తావించారు. ‘లేటేస్ట్‌ తెలుగు బ్లాక్‌ బస్టర్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ఒక యంగ్‌ ఎన్‌ఆర్‌ఐ సీఎం అవుతాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన భరత్‌.. యంగ్‌, డైనమిక్‌, ప్రియమైన సీఎంగా మారిపోతాడు. ఈ సినిమా థీమ్‌ విషయానికి వస్తే ‘నమ్మకం’. సినిమాలో భరత్‌కు తన తల్లి ఒక మాట చెబుతుంది. ఇచ్చిన మాట విూద నిలబడనివాడు మనిషే కాదని. ప్రజల మనోభావలను ఈ చిత్రంలో ప్రస్తావించడంతో ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది’ అని జయదేవ్‌ వివరించారు.