పాస్‌పుస్తకాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

వరంగల్‌,మే3(జ‌నం సాక్షి):అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతుల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ వారికి చేయూతనిస్తోంది. అందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భూసమస్యల పరిష్కారానికి రికార్డుల ప్రక్షాళన ప్రారంభించింది. ఆరు నెలలుగా ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి ప్రక్షాళన పూర్తి చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా డిజటలైజ్డ్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను అందజేయనున్నారు. దీని కోసం జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే 10వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. మొదటి దశలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 124 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 46,729 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చేరిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను ఆయా మండలాలకు పంపించి పరిశీలన కార్యక్రమం కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంట పెట్టుబడి అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో సుమారు 78 వేల మంది రైతులకు చెక్కుల ద్వారా రూ.69కోట్లు అందజేయనున్నారు. రంగల్‌ అర్బన్‌ జిల్లాలో మొదటి దశలో 69,109 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుతం జిల్లాకు 46,729 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు చేరినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మిగిలినవి కూడా త్వరలోనే రానున్న ట్లు అధికారులు చెప్పారు. అంతేకాక ఒక రైతుకు ఒకే ఖాతా నంబర్‌ను కేటాయించారు. ఒకే ఖాతా నంబర్‌లోనే ఎన్ని సర్వే నంబర్లు ఉంటే అన్ని
అదే ఖాతా బుక్‌లో నమోదు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,33,922 సర్వే నంబర్లుండగా 1,31, 221 ఖాతా నంబర్లు ఉన్నాయి. వీటిలో 92,966 ఖాతా నంబర్లు క్లియర్‌గా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.  మొదటి
దశలో జిల్లాకు 46,729 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు చేరాయి.