పుతిన్‌తో ట్రంప్‌ భేటీలో జెలెన్‌స్కీ

` ఆహ్వానించనున్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కూడా ఆహ్వానించడానికి ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి అలాస్కాలో పుతిన్‌, జెలెన్‌స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ముందే ట్రంప్‌ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. దీనిపై క్రెమ్లిన్‌ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. తొలుత పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని యోచించారు. ఈ నేపథ్యంలో భేటీకి జెలెన్‌స్కీని ఆహ్వానించడంపై ట్రంప్‌ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. శాంతి చర్చల్లో కీవ్‌ను కూడా భాగం చేయాలని యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, పోలాండ్‌, ఫిన్లాండ్‌ వంటి యూరోపియన్‌ దేశాలు అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేయడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అమెరికాలోని అలాస్కాలో పుతిన్‌తో భేటీ అవ్వనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. పుతిన్‌తో సమావేశంలో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నామని ట్రంప్‌ తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ఆయన వెల్లడిరచారు. మరో వైపు భూభాగాల మార్పిడిని అంగీకరించేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అలాస్కా సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పాల్గొంటారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.