పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

వరంగల్ బ్యూరో, జనవరి 07 (జనం సాక్షి)
25 సంవత్సరాలు ఒకే పాఠశాలలో.. ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న అద్భుత సన్నివేశం వరంగల్ నగరంలోని ఖమ్మం ప్రధాన రహదారి ఎన్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం చోటుచేసుకుంది. 1998- 99 సంవత్సరంలో నూతన విద్యానిలయంలో పదవ తరగతి చదువుకున్న బ్యాచ్ ఒకే చోట కలుసుకొని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు.. వాళ్ళ కుటుంబ నేపథ్యం, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు మొదలైన విషయాలపై పూర్వ విద్యార్థులు తమ వివరాలను అనుభవాలను పంచుకున్నారు. తామంతా ఇక్కడికి రావడం అప్పుడు చదువుకున్న స్నేహితులతో కలిసి తమ అనుభవాలను అభిప్రాయాలను వెల్లడించడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే పూర్వ విద్యార్థులు కలుసుకొని ఆనందాన్ని పంచుకోవాలని తీర్మానించుకున్నారు. కష్ట సుఖాలలో ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలని అనుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి సహ పంక్తి భోజనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అనిష్, నజీర్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, కిరణ్, రాణి, శ్రీలత, శిరీష, జ్యోతి, సుభాషిని, స్వాతి తదితరులు పాల్గొన్నారు.