పొరుగు రాష్ట్రాలను అధ్యయనం చేస్తాం

4

– మరింత మెరుగైన సేవలందిస్తాం

– మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 20(జనంసాక్షి):  హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మెరుగైన పాలనను అందించేలా కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. నగరాల్లో మెరుగైన సేవలు అందించి పాలనను ప్రక్షాళిస్తామని అన్నారు. దేశంలోని ఇతర రాష్టాల్ల్రో అవలంబిస్తున్న మున్సిపల్‌ పాలనా విధానాలపై సవిూక్షిస్తామని అన్నారు. ఆస్కి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో  ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ ,అస్కి ఆధ్వర్యంలో చాలా బాగా నిర్వహించారని ఆయన కొనియాడారు.  మహారాష్ట్ర పట్టణాల్లో బహిరంగ మలమూత్రం చేసిన విధానం, ఢిల్లీ తరహాలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నాగపూర్‌ నగర 24 గంటల మంచినీటి సరఫరా చేయడంపై అక్కడి అధికారులు వివరాలు ఇచ్చారని చెప్పారు. చెన్నైలో బాండ్‌ జారీ చేసి.. నిధుల సేకరణపై, బెంగళూరు టెండర్‌ ష్యూర్‌ విధానంపై పరిశోధన చేసి హైదరాబాద్‌లో మంచి మున్సిపల్‌ పాలనా విధానాలు అవలంబిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.గతంలో నగరాభివృద్దికి ఏం జరిగిందనేది ప్రధానం కాదు ప్రస్తుతం హైదరాబాద్‌ నగరాన్ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను, మంచి పనులను స్వీకరిస్తాంఅని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. పురపాలనలో ఉత్తమ విధానాలు అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో శనివారం నాడు నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌ను మంత్రి కె.టి.ఆర్‌ ప్రారంభించారు. నగర మేయర్‌ బొంతు రాంమోహన్‌, డిప్యూటి మేయర్‌ బాబా ఫసియోద్దీన్‌, రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్‌, సీడీఎంఏ దానకిషోర్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి,  హెచ్‌ఎండిఏ కమిషనర్‌ చిరంజీవులు, హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండి ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, నిజామాబాద్‌ మేయర్‌ ఆకుల సుజాత, వరంగల్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్‌ ప్రసంగిస్తూ దేశంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనంచేసి హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ స్వీయ ఆర్థిక వనరుల, స్వయం సంవృద్దితో కలిగి ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని స్మార్ట్‌, గ్రీన్‌, గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ఉత్తమ పథకాలను స్వీకరించి అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నగరంలోమంచిరోడ్లు, పరిశుభ్రమైన వీధులు, మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పకాలిక, మధ్యకాలిక, ధీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి ప్రణాళికబద్ధంగా అమలు చేయనున్నట్లు, దీనిలో భాగంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, వాటర్‌వర్క్స్‌ శాఖల ద్వారా తొలుత వంద రోజుల ప్రణాళికలను ప్రకటించామని పేర్కొన్నారు. పురపాలనలో నగర పౌరుల భాగస్వాములను చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని, ఇందుకు గాను వార్డు కమిటీలు, బస్తీ కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కమిటీల్లో స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులను నియమిస్తామని తెలియజేశారు. హైదరాబాద్‌ నగరాన్ని పరిశుభ్ర నగరంగా చేపట్టడానికి స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ఏ ఇతర నగరాల్లో నిర్వహించని విధంగా నిర్వహించామని, ఈ స్వచ్ఛ హైదరాబాద్‌లో వచ్చిన ప్రతిపాధనల మేరకు హైదరాబాద్‌ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్‌బిన్‌ల చొప్పున 44లక్షల డస్ట్‌బిన్‌ల పంపిణీ, 2,500ఆటోటిప్పర్ల ఏర్పాటు, స్వచ్ఛ హైదరాబాద్‌ ప్రతిపాధనలను చేపట్టడానికి 200కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని మత్రి కె.టి.ఆర్‌ గుర్తు చేశారు. తమిళనాడులో స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు పెంచేందుకుగాను ఏర్పాటు చేసిన తమిళనాడు నగర మౌలిక సదుపాయల కల్పన, ఆర్థిక సర్వీస్‌ల సంస్థను ఏర్పాటుచేసి విజయవంతంగా నడిపిస్తున్నారని, ఈ సంస్థలు కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ఈ నెల 27వ తేదీన చెన్నై పర్యటించనున్నట్లు కె.టి.రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్కీ ఛైర్మన్‌ పద్మనాబయ్య మాట్లాడుతూ నగర పాలక సంస్థలు కేవలం పారిశుద్ద్య కార్యక్రమాలు, పౌరసేవలను సమర్థవంతంగా అందించేవిధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో వందలాదిగా భారీ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయని, వీటి నుండి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ నిధులను అభివృద్ది కార్యక్రమాలకు స్వీకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో మహారాష్ట్రలో బహిరంగ మలమూత్ర విసర్జన నిరోదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ నగరాభివృద్ది కార్యదర్శి మనిషాపటాంకర్‌, నాగ్‌పూర్‌ నగరంలో 24గంటల నీటి సరఫరా, నీటిని రీసైక్లింగ్‌ చేసి పునరువినియోగం పై విశ్వరాజ్‌ ఇన్‌ఫ్రా ఎండి అరుణ్‌లఖాని, బెంగళూర్‌ నగరంలో పన్నుల విధానంలో మార్పులు అనే అంశంపై బెంగళూర్‌ కార్పొరేషన్‌ డిప్యూటి కమిషనర్‌ మల్లిఖార్జున్‌, ఢిల్లీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎండి మహేశ్‌బాబు తదితర అంశాలపై ఈ వర్క్‌షాప్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో జిహెచ్‌ఎంసి, వాటర్‌వర్క్స్‌, మెట్రోరైలు, హెచ్‌ఎండిఏ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. మార్చి మొదటివారంలో జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలో నగర ప్రాజెక్టులపై సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు.ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తామని  మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మౌలిక అంశాలపై మొదట దృష్టిసారిస్తామన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను పరిశీలించి అనుసరిస్తామని తెలిపారు. వివిధ నగరాల్లో అమలవుతున్న పద్ధతులపై అధ్యయనం చేస్తానని, త్వరలో పలునగరాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానన్నారు. హైదరాబాద్‌లో పర్యావరణహిత కార్యక్రమాలపై చర్చిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మారుస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు బెంగళూరులో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. ఐటీ పార్క్‌, మూసీ పరిసరాల్లో ఆరులైన్ల రోడ్లపై అధ్యయనం చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో మార్చి మొదటి వారంలో జాతీయస్థాయి నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్‌ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోమన్‌, డిప్యూటి మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.