పోరు ఏకపక్షం కావాలి

– ‘విూ భవిష్యత్‌ నా బాధ్యత’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లండి
– హైదరాబాద్‌, ఢిల్లీ వేదికగా ఏపీపై కుట్రలు చేస్తున్నారు
– జగన్‌ను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది
– చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవు
– ధర్మపోరాటంలో విజయం సాధించేది టీడీపీనే
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి11(జ‌నంసాక్షి) : ఏప్రిల్‌11న జరిగే ఎన్నికలు ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య జరిగే పోరు అని, ఈ పోరులో టీడీపీ గెలుపు ఏకపక్షం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ 30రోజుల సమగ్ర ప్రణాళికతో ఎన్నికలకు కదం తొక్కాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామని తెలిపారు. ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించి మరింత అప్రమత్తంగా ఉండాలని క్యాడర్‌కు సూచించారు. ‘విూ భవిష్యత్‌ నా బాధ్యత’ అనే తెదేపా నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు. ‘మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ’ అనే నినాదంతో జగన్‌ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారని గుర్తు చేశారు. దీని బట్టే ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని, కేసీఆర్‌కు మనకు తేడా అదేనని చంద్రబాబు అన్నారు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా తమకు ఉందని, చేతకాని వాళ్లం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను దొంగతనంగా అనుభవిస్తూ కుట్రలు పన్నే స్థాయికి వచ్చారని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. నేటినుంచి నెలరోజులు ప్రతి ఒక్కరిలోనూ అప్రమత్తత అవసరమని చంద్రబాబు సూచించారు. ఎన్నికల యుద్ధానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలు కూడా ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. దీన్ని సమర్థంగా ఎండగట్టాలని సూచించారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజులు ముందుకు తీసుకురావడాన్ని సంక్షోభంగా భావించరాదని, దీన్నే అవకాశంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవని, ధర్మాన్ని ఏమార్చడం ఎవరి వల్లా కాదని, సత్యానికి ఉన్న శక్తి గొప్పదని పేర్కొన్నారు. ధర్మపోరాటంలో టీడీపీదే విజయం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.