పోలీస్ ఇంట్లో దోపిడి… నగలు, నగదు చోరీ
విజయవాడ, జనవరి18(జనంసాక్షి) : పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగిన ఘటన శుక్రవారం తాడేపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే… విజయవాడలో ఎఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కుంభం రమేష్ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు కానిస్టేబుల్ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ప్రవేశించి ఇంట్లో దాచి ఉంచిన 50 వేల నగదు , సుమారు లక్ష రూపాయల విలువైన నగలను దోచుకెళ్లిపోయారు. విషయం తెలిసిన తాడేపల్లి సిఐ బ్రహ్మయ్య చోరీ జరిగిన
కానిస్టేబుల్ ఇంటిని పరిశీలించారు. వాస్తవానికి తాడేపల్లిలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు పట్టపగలే రెక్కీ నిర్వహించి, అర్ధరాత్రి లో తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి తాపీగా దోచుకుంటున్నారు. పోలీస్ ఇంటిని దొంగలు దోచుకోవటం గ్రామస్తులకు విస్మయాన్ని కలిగిస్తుంది. ‘ పోలీసుల ఇల్లునే దొంగలు దోచుకుంటే.. మా ఇళ్లకు రక్షణ ఎక్కడిదని ‘ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పోలీసు నిఘా ఎక్కడుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.