ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలవం

ఆదిలాబాద్‌, జూలై 13 ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ శాసన సభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం సహాయం అందించడం ద్వారా అవినీతిని మరింత ప్రోత్సహించడమేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఒకపక్క ప్రజలపై పన్నులు వేస్తూ, మరో పక్క ధరలు పెంచడం వల్ల సామాన్యులు తట్టుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ యూనిట్ల ధరలను పెంచి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేసి విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విషయమై కాంగ్రెస్‌ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సమస్యను జాప్యం చేస్తే ప్రజలు మరోసారి ఉద్యమం చేపడతారని హచ్చరించారు.